కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ, బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 28న కరీంనగర్ కలెక్టరేట్ వద్ద రెండు గంటల నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రకటించారు.
బుధవారం కరీంనగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చా నాయకులు, ఉమ్మడి జిల్లా ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ప్రకటించిన హామీలు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా ఉన్నాయన్నారు. నేటికీ వేలాది మంది రైతులు రుణమాఫీ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, రైతు రుణమాఫీ, రైతు భరోసా అంశాల్లో రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరూ గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అసెంబ్లీలోనే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెండు లక్షల పై రుణం ఉన్న రైతులకు రుణమాఫీ వర్తించదని ప్రకటించడం రైతాంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, కరివేద మహిపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అన్నాడి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
