సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేంద్రం చర్యలు..
జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు సూచన
న్యూఢిల్లీ:జాతీయ భద్రతకు విఘాతం కలిగించేలా, హింసను ప్రేరేపించేలా సోషల్ మీడియా వేదికలపై పోస్టులు చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పెరుగుతున్న అసత్య ప్రచారాలు, సామాజిక విభేదాలకు దారితీసే పోస్ట్లపై ఐటీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపధ్యంలో, జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. హింసను రెచ్చగొట్టేలా, సామాజిక శాంతిని భంగపరిచేలా ఉన్న కంటెంట్ను నిర్దాక్షిణ్యంగా తొలగించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.
మే 8వ తేదీలోగా పూర్తి స్థాయి నివేదికను అందించాలని కమిటీ ఆదేశించింది. దీనికి అనుగుణంగా సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ సంబంధిత డేటా సేకరణ, విశ్లేషణ పనులను వేగవంతం చేస్తోంది.
ఈ చర్యలు సోషల్ మీడియాలో బాధ్యతాయుత వాడకానికి మార్గం వేస్తాయని కేంద్రం భావిస్తోంది.
