
వైద్యులపై దాడులు హేయం – హుజురాబాద్ ఐఎంఏ నిరసన
హుజురాబాద్: ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వైద్యులపై దాడులు చేయడం హేయనీయ చర్య అని హుజురాబాద్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పేర్కొన్నారు. హైదరాబాదులోని రెండు ఆసుపత్రుల్లో రోగి మృతికి వైద్యులే కారణమంటూ బంధువులు ఆసుపత్రి సిబ్బంది, సామాగ్రిపై దాడి చేసిన ఘటనను ఖండిస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట–హుజురాబాద్ ఐఎంఏ ఆధ్వర్యంలో శనివారం స్థానిక గాంధీ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా డాక్టర్ తిరుపతి మాట్లాడుతూ, ప్రతి వైద్యుడు తన శక్తి వంచన లేకుండా ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తారని, చికిత్సలో విఫలమైతే వైద్యులే తీవ్రంగా బాధపడతారని అన్నారు. ఇటువంటి ఘటనల్లో ఆసుపత్రులపై దాడులు చేయడం సమంజసం కాదని, బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో డాక్టర్ ముక్క రాజేశ్వరయ్య, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, డాక్టర్ రాణి, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ దేవేందర్ రెడ్డి, ఉడుగుల సురేష్, డాక్టర్ కిషోర్, ఆకుల శ్రీనివాస్, సురేష్, శరత్, ప్రణీత తదితరులు పాల్గొన్నారు.
