
రెవెన్యూ, స్టాంప్స్, సర్వే విభాగాల అనుసంధానానికి సాఫ్ట్వేర్ అభివృద్ధి
త్వరలో 408 నక్షా గ్రామాల్లో రీసర్వే ప్రారంభం: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (జిందగీ 9న్యూస్):
ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శక సేవలు అందించేందుకు రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్స్, సర్వే విభాగాలను అనుసంధానించేలా సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర కార్యాలయంలో రెవెన్యూ, స్టాంప్స్, సర్వే విభాగం, ఎన్.ఐ.సి అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూభారతి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ను జత చేయడం తప్పనిసరి కాబట్టి భూభారతి పోర్టల్కు సర్వే మ్యాప్లను లింక్ చేసే సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పోర్టల్లో సాంకేతిక సమస్యలు రాకుండా సులభంగా నిర్వహణ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎన్.ఐ.సి అధికారులను ఆదేశించారు. కొత్త సాఫ్ట్వేర్లో కోర్టు కేసుల మానిటరింగ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
నక్షా లేని ఐదు గ్రామాల్లో రీసర్వే పూర్తయిన నేపథ్యంలో మిగిలిన 408 గ్రామాల్లో త్వరలోనే రీసర్వే ప్రారంభిస్తామని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో భూవివాదాల పరిష్కారానికి ఈ సర్వే మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.
