
రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
కొలువుల పండుగలో 1,370 మందికి నియామక పత్రాలు అందజేత
హైదరాబాద్లో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగంలో కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా యువతను తీర్చిదిద్దే
కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు.
హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 25 శాఖలకు సంబంధించిన గ్రూప్–IIIలో
ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను లాంఛనంగా అందజేశారు.
కొత్తగా నియమితులైన ఉద్యోగులు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం ఆకాంక్షించారు.
తల ఎత్తుకుని పనిచేశానని గర్వంగా చెప్పుకునేలా పని చేయాలి.
పరిపాలనలో ప్రక్షాళన జరగాలంటే చిత్తశుద్ధితో పనిచేయాలి” అని సీఎం పేర్కొన్నారు.
2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగలేదని సీఎం విమర్శించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 14 సంవత్సరాల పాటు గ్రూప్–I నియామకాలు కూడా జరగలేదన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు, గత రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలను
భర్తీ చేసిన ఘనత సాధించామని తెలిపారు.
నాణ్యమైన విద్య లేకపోవడం వల్ల అంతర్జాతీయ అవకాశాలను యువత అందిపుచ్చుకోలేకపోతున్నారని
సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో మార్పు తీసుకొచ్చేది విద్య ఒక్కటేనని,
పేదలకు నాణ్యమైన విద్య అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల
ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఇప్పుడే ఉద్యోగాల్లో చేరుతున్నవారంతా 2047 నాటికీ ప్రభుత్వ సేవల్లో కొనసాగుతారని తెలిపారు.
తల్లిదండ్రులను గౌరవించని ఉద్యోగుల జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి,
ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తాం” అని సీఎం హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి నూతన సంవత్సరం
మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
