ఆ కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: డిమాండ్
వనపర్తి జిల్లా, మే 22: వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం మియాపురం గ్రామానికి చెందిన కురువ గోపాల బాలరాజు (17) పిడుగు పడి మృతిచెందిన సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బాలరాజు వృత్తిపరంగా గొర్రెలు, మేకల పెంపకం చేసుకునే కుటుంబానికి చెందినవాడు. బుధవారం సాయంత్రం పొలంలో గొర్రెలను మేపుతున్న సమయంలో ఆకస్మికంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చి, పిడుగు పడిన ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటన జరిగిన సమయంలో గొర్రెల మంద దగ్గర అతని తండ్రి గోపాల సహదేవుడు, బీరయ్య ఉన్నారు. వారు ఇద్దరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. మృతుడైన బాలరాజు తండ్రికి ఏకైక కుమారుడు కావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక మరియు మానసిక దుఃఖంలో మునిగిపోయింది.
ఈ ఘటనపై స్పందించిన గొర్రెల మేకల పెంపకంవృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మధు యాదవ్, బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు తగిన నష్టపరిహారం ప్రభుత్వం అందించాలన్నారు. వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో పిడుగుల బారిన పడే సంఘటనలు ఇటీవల విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రాధాన్యతతో తీసుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
“జీవనాధారంగా ఉన్న ఒక్క గాను ఒకడిని కోల్పోయిన ఈ కుటుంబం భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కనీసం ప్రభుత్వం ఆదుకుంటేనే వాళ్లకు మళ్లీ నయం,” అని మధు యాదవ్ పేర్కొన్నారు.

