
దళితుల పై ప్రేమ ఉంటే… దళితుని సీఎం చేయండి – కొప్పుల ఈశ్వర్ సవాల్
బీఆర్ఎస్ పై విమర్శల జవాబుగా దళిత హక్కులపై ఘాటైన వ్యాఖ్యలు
కరీంనగర్, మే 15: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేశారు. శీరిపురం కాలనీ, కరీంనగర్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “బీఆర్ఎస్ హామీల అమలు విషయంలో తమది గ్యారంటీ,” అంటూ స్పష్టం చేశారు.
“దళితుని చేత బీఆర్ఎస్ పగ్గాలు ఇవ్వాలని కోరుతున్న రేవంత్ రెడ్డి, ఖర్గే గారిని ప్రధానమంత్రిగా ఎందుకు సూచించడంలేదు? రాహుల్ నాయకత్వం గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు?” అని నిలదీశారు. అలాగే, “కులగణన ఖర్గే సూచనలతో అనడం కాదు, రాహుల్ చెప్పాడనే ప్రచారం మాత్రమే ఉంది,” అంటూ కాంగ్రెస్లోని వాస్తవికతను ప్రజల ముందు ఉంచారు.
రేవంత్ దళిత ప్రేమ నిజమైతే…
“రేవంత్కు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే, ఒక దళితుని సీఎం పదవికి సిఫార్సు చేయాలి,” అని డిమాండ్ చేశారు. “దళితుల పట్ల కాంగ్రెస్ ప్రవర్తన మొసలి కన్నీళ్లు, పెదవుల మీద ప్రేమ తప్ప పదవులిచ్చే ప్రేమ లేదు” అని ఎద్దేవా చేశారు.
ఖర్గే డమ్మీ అధ్యక్షుడే!
“ఖర్గే గారు కాంగ్రెస్ AICC అధ్యక్షుడుగా ఉన్నా, నడిపేది మాత్రం రాహుల్ గాంధీ, ఇది దేశ ప్రజలకు తెలిసిందే,” అని ఆరోపించారు. “సోనియా, రాహుల్, ప్రియాంకల జపం తప్ప కాంగ్రెస్ లో ఇంకేమీ ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది,” అని పేర్కొన్నారు.
రెవంత్ సీఎం స్థాయికి తక్కువ వ్యాఖ్యలు!
రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై వ్యాఖ్యలు చేయడం దారుణమని విమర్శించారు. “మా నాయకులపై బిల్లా, రంగా లాంటి వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు,” అన్నారు.
కాంగ్రెస్ లో నాయకత్వం ఢిల్లీకే పరిమితం
“తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ లేనిదే మూడో నెల దాటుతోంది. రేవంత్ రెడ్డి సీఎం పదవి ఎసరు పడుతుందనే భయంతో విస్తరణ చేయడం లేదు,” అని విమర్శించారు.
బీఆర్ఎస్ దళితులకు రెండు సార్లు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత కలిగిన పార్టీ అని స్పష్టం చేశారు. అదేవిధంగా, విజయ రామారావును బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా నియమించటం, 1985 నుండి ఇప్పటివరకు దళితులకి ఏ విధంగా ప్రాధాన్యం ఇచ్చామన్న దానిపై తాము స్పష్టంగా ఉన్నాం అని వివరించారు.
సామాజిక న్యాయం పేరు మీద కాంగ్రెస్ దుర్వినియోగం
గాంధీ కుటుంబానికి మాత్రమే అధికారం ఇవ్వడం, ఇతరులను అవకాశం ఇవ్వకపోవడాన్ని “సామాజిక అన్యాయం”గా అభివర్ణించారు. “46 ఏళ్ళు గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీని నడిపింది. ఖర్గే లాంటి దళితుల పదవీకాలం ముష్టి మూడేళ్లు కూడా దాటలేదు,” అంటూ చరిత్రతో సాక్ష్యాలు అందించారు.
