మేడ్చల్: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లో భారీగా నష్టపోయి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, గ్రామానికి చెందిన సోమేశ్ అనే యువకుడు ఇటీవల క్రికెట్ బెట్టింగ్లో భారీగా పాల్గొన్నాడు. ఒకేరోజు లక్ష రూపాయలు పోగొట్టుకున్న అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. కుటుంబసభ్యులు సోదరి వివాహం కోసం దాచిన డబ్బులను కూడా బెట్టింగ్లో పెట్టాడని సమాచారం.
తన బాధను వ్యక్తం చేస్తూ.. “నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడయ్యా. డబ్బుల విషయంలో కాదు, నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మానాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సారీ” అంటూ స్టేటస్ పెట్టి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
క్రికెట్ బెట్టింగ్ మాఫియా ఆగడాలు
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యువతను ఊహించని పరిణామాలకు దారితీస్తోంది. సోషల్ మీడియా ద్వారా విస్తరిస్తున్న ఈ బెట్టింగ్ ముఠాలు అనేకమందిని ఆర్థికంగా, మానసికంగా నష్టపరిచాయి.
ప్రభుత్వం, పోలీస్ శాఖ స్పందించాలనే డిమాండ్
ఈ ఘటనపై యువత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్ వెబ్సైట్లను నిషేధించడంతో పాటు, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
(క్రికెట్ బెట్టింగ్ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో.. సమాజంలో అవగాహన పెంపొందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.)
