కరీంనగర్: తెలంగాణలో బీజేపీ లేదు అనే కేటీఆర్ వ్యాఖ్యలు అతని రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు విమర్శించారు.
నిన్న కరీంనగర్లో జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సంపత్ రావు, “కేటీఆర్ మాటలను ప్రజలు నవ్వుకుంటున్నారు,” అని వ్యాఖ్యానించారు.
2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 8 పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నప్పటికీ, బీఆర్ఎస్ మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని, అనేక నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా కోల్పోయిందని గుర్తు చేశారు. కేటీఆర్ ఈ వాస్తవాలను మర్చిపోయినట్టున్నాడని ఆయన చురకలంటించారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండానే వెనుకడుగు వేసిందని, కానీ బీజేపీ మాత్రం పట్టభద్రుల స్థానం, టీచర్ల స్థానం రెండింటిలోనూ విజయం సాధించిందని ఆయన తెలిపారు.
తెలంగాణలో బీఆర్ఎస్ రోజురోజుకు ఉనికి కోల్పోతుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పూర్తిగా అంతరించిపోతుందని, కేటీఆర్ ఆ భయంతోనే అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఎర్రబెల్లి సంపత్ రావు మండిపడ్డారు.
“రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడనుంది,” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
