అల్ఫోర్స్ ఈ-టెక్నో స్కూల్లో ఎన్సీసీ కెడెట్లకు “ఏ” సర్టిఫికెట్ల పంపిణీ

కరీంనగర్, జూలై 26:కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో 46 మంది ఎన్సీసీ (NCC) కెడెట్లకు “ఏ” సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి భావన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యార్థులు చదువుతోపాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సమాజాన్ని ఆకళింపు చేసుకునే అవగాహన కలుగుతుందన్నారు. ఎన్సీసీ వంటి కార్యక్రమాల ద్వారా దేశ సమగ్రతను పెంపొందించడమే కాక, యువతలో దేశ పట్ల విధేయత, క్రమశిక్షణ, సమాజ సేవ వంటి విలువలు బలపడతాయని అన్నారు.
ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో ఇటీవల నిర్వహించిన “ఏ” సర్టిఫికెట్ పరీక్షలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు గుర్తింపుగా ఈ సర్టిఫికెట్లు అందించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఎన్సీసీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
