
లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టుబాటు
కామారెడ్డి జిల్లా: ఫిర్యాదుదారుడి తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని ఫిర్యాదుదారుడి పేరు మీద నమోదు చేయించేందుకు అనుకూలంగా నివేదికను పంపిస్తానని చెప్పి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్, తెలంగాణ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండల తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాసరావు, ఈ పనికి సంబంధించి ఫిర్యాదుదారుని నుంచి రూ.50,000 లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం స్వీకరణలో ప్రైవేట్ వ్యక్తి చిన్నూరి అజయ్ సహకారం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఫిర్యాదు మేరకు ముందుగానే ప్రణాళిక రూపొందించిన ఏసీబీ అధికారులు, లంచం ఇచ్చే సమయంలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తహసీల్దార్తో పాటు ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న ఇతరులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల వ్యవహారాలపై ఏసీబీ నిఘా మరింత కఠినంగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
