కరీంనగర్ రూరల్ మండలంలోని జూబ్లీనగర్లో ‘గావ్ చలో’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘రేషన్ బియ్యంలో కేంద్ర హక్కు ఉందని చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ ఇచ్చిన బియ్యాన్ని తమదిగా ప్రచారం చేస్తోంది. మీరు కిలోకు రూ.10లు ఖర్చు చేస్తే, మోదీ ప్రభుత్వం రూ.37లు ఖర్చు చేస్తోంది. ఎవరు గొప్ప?’’ అని ప్రశ్నించారు. ‘‘ధైర్యం ఉంటే కేంద్రానికి లేఖ రాస్తారా? మేమే రూ.50లు ఖర్చుపెట్టి బియ్యం ఇస్తామనండి’’ అంటూ రేవంత్ రెడ్డిని సవాల్ చేశారు.ఆయుష్మాన్ భారత్ను అమలు చేయకుండా, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకుండా పేదలకు వైద్యం దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మోదీ 4 కోట్ల ఇండ్లు నిర్మించగా, తెలంగాణలో 11 ఏళ్లుగా పేదలకు గూడు లేదు అన్నారు. గ్రామాభివృద్ధికి కేంద్ర నిధులే ప్రధానమని స్పష్టం చేశారు. ‘‘మోదీ పాలనను మరవొద్దు… బీజేపీని విడవొద్దు’’ అని పిలుపునిచ్చారు.
