
కోతుల గుంపు దూసుకురావడంతో భయంతో మెట్లపై నుంచి జారి పడి మహిళ మృతి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. లింగాపూర్ గ్రామానికి చెందిన కేసిరెడ్డి విమల (50) తనపై దూసుకొచ్చిన కోతుల గుంపును తరిమే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారి కింద పడిపోయి మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం, బుధవారం ఉదయం విమల ఇంటి ముందు పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా కోతుల గుంపు దూసుకొచ్చింది. భయాందోళనకు గురైన ఆమె వాటిని అడ్డుకునే క్రమంలో ఇంటి మెట్టపై నుంచి జారి పడింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి.
కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విమల మృతితో లింగాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.గ్రామంలో కోతుల బెడద పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, తక్షణమే చర్యలు తీసుకుని కోతుల నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
