
ఆర్థిక ఇబ్బందులతో గృహిణి ఆత్మహత్య
జమ్మికుంటలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక గృహిణి ప్రాణాలు తీసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తండ్రి గంగారపు చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం— ఆయన కూతురు విజయరాణి (35), కేశవాపూర్ గ్రామానికి చెందిన కిరణ్కుమార్తో 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. భర్త పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ, స్థిరమైన ఆదాయం లేకపోవడంతో కుటుంబ ఖర్చులు భారంగా మారి తరచూ ఆర్థిక ఒత్తిడులు ఎదురయ్యేవని తెలిపారు.
ఈ నేపథ్యంలో నవంబర్ 28న ఉదయం విజయరాణి గడ్డి మందు తాగింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించి నవంబర్ 29న మధ్యాహ్నం చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది.
ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదన కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నదని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

