విద్యుదాఘాత మరణాలకు ఎక్స్గ్రేషియా రూ.8 లక్షలు.. టీజీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం
రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పరిహారం పెంపు
2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి నిర్ణయం
జంతువుల పరిహారంలో ఎలాంటి మార్పు లేదు

హైదరాబాద్, జూలై 29 (Zindagi9News): తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) విద్యుదాఘాతంతో మరణించే శాఖేతర వ్యక్తుల కుటుంబాలకు చెల్లించే ఎక్స్గ్రేషియా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని సంస్థ వెల్లడించింది.
తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) సూచనల మేరకు డైరెక్టర్ల మండలి ఈ నిర్ణయాన్ని ఆమోదించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పెంచిన ఎక్స్గ్రేషియా మొత్తంలో రూ.7.20 లక్షలను స్థిర డిపాజిట్ (ఎఫ్డీ) రూపంలో, మిగిలిన రూ.80 వేల నగదుగా బాధిత కుటుంబాలకు అందజేయనున్నారు.
అయితే విద్యుదాఘాతంతో జంతువులు మృతి చెందిన సందర్భాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న పరిహారంలో ఎలాంటి మార్పు చేయలేదు. పశువులకు రూ.40 వేలు, గొర్రెలు, మేకలకు రూ.7 వేల పరిహారమే కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఈ నిర్ణయంతో విద్యుదాఘాత ఘటనల్లో మరణించిన బాధిత కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది.
