1983 తర్వాత రెండో త్రైమాసికంలో అత్యధిక ఏసీబీ కేసులు నమోదు
2026 రెండో త్రైమాసిక పనితీరుపై డీజీ చారు సిన్హా సమీక్ష
అవినీతిపై ఉక్కుపాదం.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు సత్కారం

హైదరాబాద్, జూలై 28 (Zindagi9News): తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 2026 రెండో త్రైమాసికంలో 1983 తర్వాత ఇదే కాలంలో నమోదైన కేసులతో పోలిస్తే అత్యధిక అవినీతి కేసులను నమోదు చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా 2026 రెండో త్రైమాసికంలో నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతిపై సమగ్రంగా సమీక్షించిన డీజీ, ఏసీబీ అధికారులు, సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతి నిర్మూలనలో అధికారులు చూపిన అప్రమత్తత, వృత్తి నిబద్ధత, సమష్టి కృషి వల్ల ఈ ఫలితాలు సాధ్యమైనట్లు పేర్కొన్నారు.
సమీక్ష అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ ‘రివార్డ్ మేళా’ నిర్వహించి ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. అవినీతి దేశాన్ని లోపల నుంచే బలహీనపరుస్తుందని పేర్కొన్న చారు సిన్హా, చట్టపరమైన విలువలు, నిజాయితీ, ప్రజాసేవా దృక్పథంతో మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.
అవినీతి నిరోధక చర్యలను మరింత ముమ్మరం చేయడంతో పాటు, నిష్పక్షపాత దర్యాప్తు, సంస్థాగత అప్రమత్తత, వృత్తి నైపుణ్యాల పెంపుదల ద్వారా ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడమే ఏసీబీ లక్ష్యమని డీజీ స్పష్టం చేశారు.
