
ఈ ఏడాది ఇంటర్ అడ్మిషన్లు యథావిధిగా.. విలీనంపై అసెంబ్లీ చర్చ తర్వాతే నిర్ణయం
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే అంశంపై వస్తున్న ఊహాగానాల మధ్య తెలంగాణ ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరానికి (2026-27) ఇంటర్ అడ్మిషన్లు యథావిధిగా కొనసాగుతాయని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.
అదే సమయంలో, ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే అంశంపై వచ్చే ఏడాది అసెంబ్లీలో సమగ్ర చర్చ నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశంపై ప్రభుత్వం పరిశీలన కొనసాగిస్తోందని, విద్యా నిపుణులు, సంబంధిత వర్గాల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది.
ఇంటర్ అడ్మిషన్లు నిలిపివేస్తారన్న ప్రచారానికి ప్రభుత్వం చెక్ పెట్టడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొంత ఊరట నెలకొంది. కాగా, విద్యా విధానంలో మార్పులపై ప్రభుత్వం భవిష్యత్తులో స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.
