
గణతంత్ర దినోత్సవ అలంకరణలపై నిర్లక్ష్యం… మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ జెండాలు
జమ్మికుంట : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ రంగుల అలంకరణలు (జెండా కవర్లు/బంటింగ్స్) సకాలంలో గౌరవంగా తొలగించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అదే ప్రాంతంలో రాజకీయ ప్రచార జెండాలను ఏర్పాటు చేయగా, తొలగించిన జాతీయ పండుగ అలంకరణలను మురికి కాలువ పక్కన చెట్టుకింద నిర్లక్ష్యంగా పడేయడం చర్చనీయాంశంగా మారింది.
జాతీయ పండుగలకు సంబంధించిన అలంకరణలను చెత్తలా వదిలేయడం తగదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యతతో పాటు ప్రజా ప్రదేశాల పరిశుభ్రతపై కూడా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
