తెలంగాణలో ప్రభుత్వ శాఖల్లో పెరిగిపోతున్న అవినీతి చర్యలపై అంటి కరప్షన్ బ్యూరో (ACB) అధికారులు బలంగా కదులుతున్నారు. తాజాగా ఏప్రిల్ 21 వ తేదీన, ఒకే రోజు మణుగూరు, చిల్పూర్, ఆర్మూర్ ప్రాంతాల్లో జరిగిన మూడు వేర్వేరు దాడుల్లో ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.
మణుగూరులో ఇన్స్పెక్టర్ & మీడియా రిపోర్టర్ లంచాల కలకలం
మణుగూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఫిర్యాదుదారుని మరియు అతని బంధువును నిందితులుగా చేర్చకుండా అధికారిక సహాయంగా వ్యవహరించేందుకు రూ.4 లక్షలు డిమాండ్ చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్. సతీష్ కుమార్, మొదటి విడతగా రూ.1 లక్ష తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో బిగ్ టీవీ రిపోర్టర్ ఎం. గోపి కూడా పాత్రధారి కావడం గమనార్హం.
చిల్పూర్లో తహశీల్దార్ కార్యాలయంలో ఆర్.ఐ. రెడ్ హ్యాండెడ్
జనగాం జిల్లా చిల్పూర్ మండల తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ (R.I.) వినీత్ కుమార్, ఫిర్యాదుదారుని మ్యుటేషన్ దస్తావేజుకు సంబంధించిన ధృవీకరణ నివేదికను సమర్పించేందుకు రూ.26,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.
ఆర్మూర్లో పంచాయతీరాజ్ సీనియర్ అసిస్టెంట్ అరెస్ట్
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఎన్. శ్రీనివాస శర్మ, ఎఫ్.టి.ఎఫ్. (Funds Transfer Order) పత్రాలపై అధికారుల సంతకాలు పొందడంలో సహాయం చేస్తానంటూ రూ.7,500 డిమాండ్ చేసి, రూ.7,000 తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు.
ఒకే రోజు – మూడు ఘటనలు – అవినీతి వ్యవస్థపై ప్రశ్నలు
ఈ మూడు ఘటనలు ఒకే రోజున చోటుచేసుకోవడం అధికార యంత్రాంగంలో అవినీతిపై గంభీరంగా ఆలోచించాల్సిన అవసరాన్ని పెంచుతోంది. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే, ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇదే.
