పెబ్బేరు, ఏప్రిల్ 13: పెబ్బేరు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో డి. మహేష్ కుమార్ ఘన విజయం సాధించారు. ఆదివారం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 645 ఓట్లకు గాను 496 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో మహేష్ కుమార్ 182 ఓట్లతో విజేతగా నిలిచారు.
ఈ నెల 3న నామినేషన్లు ప్రారంభమయ్యాక మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయితే 5వ తేదీన ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో మిగతా 6 మంది అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రతను సంతరించుకుంది. అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు.
అధికారికంగా బాదం వెంకటేష్, బుస్స రమేష్, సింగయ్య శెట్టి నేతృత్వంలో ఎన్నికలు జరిగాయి. క్రమశిక్షణతో, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగియగా, పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు.
ఇతర అభ్యర్థుల ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి:
•ఎస్. రమేష్ కుమార్ – 150 ఓట్లు
•బి. రవి కుమార్ – 89 ఓట్లు
•బి. విజయుడు – 38 ఓట్లు
•ఆర్. నవీన్ కుమార్ – 26 ఓట్లు
•ఎన్. రాజశేఖర్ – 4 ఓట్లు
•నోటా – 1 ఓటు
•చెల్లని ఓటు – 1
ఎన్నికల అనంతరం విజేత డి. మహేష్ కుమార్కు అధికారికంగా నియామక పత్రం అందజేశారు. అనంతరం మహేష్ కుమార్ దంపతులు (మహేష్ & రాధిక)ని ఆర్యవైశ్య సంఘ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ, “ఓటు వేసి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని వాసవి మాత ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
