“ప్రభుత్వం & పట్టభద్రులకు వారధిగా ఉంటా” – కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి
జగిత్యాల: రానున్న కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగతంగా విష ప్రచారం చేస్తూన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో పట్టభద్రులు, కాంగ్రెస్ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:
“ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు రిహార్సల్ లాంటివి. కాంగ్రెస్ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలి.”
“కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగ నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలను పరిష్కరించగలదు. ప్రభుత్వం & పట్టభద్రులకు వారధిగా ఉండి, వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాను.”
“మా మేనిఫెస్టోలోని జాబ్ క్యాలెండర్ను ఖచ్చితంగా అమలు చేస్తాం. అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు ప్రకటించి నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాం.”
ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి & సంక్షేమ పథకాలను ప్రతి పట్టభద్రునికి వివరించాలి అని పిలుపునిచ్చారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ & ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నరసింహ రావు సహా మండల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
