తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
“దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి? ప్రజా పాలనలో దరఖాస్తులు, గ్రామ సభల డ్రామా, ఇప్పుడు మీసేవలో మళ్లీ దరఖాస్తులు. ఈ గారడీ అంతా స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనా?” అని ఆయన ట్వీట్ చేశారు.
“బీఆర్ఎస్ పాలనలో పథకాలు దరఖాస్తు లేకుండానే అమలు అయ్యాయి. కానీ ఇప్పుడు రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇండ్ల పథకాలకు దరఖాస్తుల పేరుతో కాలయాపన. పేదల ఆకాంక్షలు నీరుగార్చకుండా, ఇచ్చిన మాట ప్రకారం పథకాలను తక్షణమే అమలు చేయండి.” అని మరో ట్వీట్లో డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
